గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజన లబ్దిదారులకు నిర్దేశించిన కార్యక్రమాలపై శిక్షణను అందించి బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయించి యూనిట్లు సక్రమంగా గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన పీఎం విశ్వకర్మ యోజన జిల్లా ఇంప్లీమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజనలో శిక్షణ పూర్తి అయిన 2760 మంది అభ్యర్ధులకు స్టైయిఫండ్, టూల్ కిట్ లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ సమయంలోనే అభ్యర్ధులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు అవసరమైన డాక్యుమెంట్లపై అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకర్లు తిరస్కరించిన పీఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులకు కారణాలను వివరిస్తూ వాటిని పరిష్కరించటానికి ఉన్న అవకాశాలపై నివేదిక అందించాలన్నారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు ఏ జయలక్ష్మీ, జిల్లా నైపుణ్యాభివృధ్ధి అధికారి సంజీవరావు, లీడ్ బ్యాంక్ మేనేజరు మహిపాల్ రెడ్డి, పీఎం విశ్వకర్మ యోజన జిల్లా మేనేజర్ మహేష్ , నగరపాలక సంస్థ పీవో రామారావు, గ్రామ,వార్డు సచివాలయ కో ఆర్డినేటర్ మోహన్ రెడ్డి, డోమైన్ ఎక్స్ పర్ట్స్ పాటిబండ్ల రామకృష్ణ, తులిమెళ్ళ రామకృష్ణ, చరకా కుమార్ గౌడ్, శిక్షణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News