-పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ ఎస్ ఎస్ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విశ్వ వసు నామ సంవత్సరం ఉగాది రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయవాడ, మహానగర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా పాల్గొని ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, గోల్వాల్కర్ ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సేవక్ లు పలు విన్యాసాలు, యోగాసనాలు, కర్ర సాము, ప్రదర్శించారు. అనంతరం “వనవాసి” పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఉగాది నాడు డాక్టర్ హెడ్గేవార్ జయంతి రోజున కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తూ అనేక తరాలుగా స్వయం సేవకులు దేశ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలకపాత్ర పోషించారని తెలిపారు. మన దేశ చరిత్ర కాపాడటంలో కూడా సంఘ కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు.
ఆర్ఎస్ఎస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలను పారద్రోలుతూ జాతిని జాగృతం చేస్తుందన్నారు. స్వయం సేవకులు దేశంలోని అన్ని రంగాలలో రాజకీయ, విద్యార్థి, కార్మిక, కర్షక ఇలా అన్ని రంగాల్లో స్వయం సేవకులు ప్రాధాన్యం పెంచారని తెలిపారు. అంతేగాక వరదలు,ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాలలోనూ స్వయం సేవకులు ముందుకు వచ్చి సహాయ పునరావాస కార్యకలాపాలను నిర్వహించడం జరిగిందన్నారు. విజయవాడ మహానగర్ సంఘ చాలక్ అన్నదేవర కృష్ణ ప్రసాద్, విభాగ సంఘచాలక్ కోనేరు దుర్గాప్రసాద్ , కర సేవకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News