అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు నియోజకవర్గంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ఉదయం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో రూ. 88.98 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని– శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలసి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను హరిప్రసాద్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News