గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం నగర పాలక సంస్థ కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు ప్రతి నెల వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని, గ్రీవెన్స్ లో అందే ఆర్జీలను, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విభాగాదిపతులకు స్పష్టం చేశారు. కార్మికులు కూడా తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ ల సమస్యలపై గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, మేనేజర్ బాలాజీ బాషా, కార్మిక సంఘాల నాయకులూ ఈ.మధుబాబు, బి.ముత్యాలరావు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొని అర్జీలు అందించారు.
Prajavartha Online Telugu News