-పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను ప్రారంభించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలను అందుకోవడం జరిగిందనీ జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డా నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మునిసిపల్ కార్పొరేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి ఐదు సంతకాలలో ఒకటిగా రాష్ట్ర వ్యాప్తంగా 250 అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. కేవలం 15 రూపాయలతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం మూడు పూటల కడుపు నిండా భోజనం చేయడం జరుగుతోందనీ ప్రజలు చెప్పడం జరిగిందని తెలిపారు. ఇంటి లో కంటే మెరుగ్గా రుచికరంగా, వేడి వేడి గా ఇక్కడ ఆహారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ పనులు నిమిత్తం, ఆరోగ్య సమస్యల పరిష్కార కోసం ఆసుపత్రులకు వొచ్చే వారు, చదువుకునే విద్యార్థులు పలువురు అన్నా క్యాంటీన్ కు రావడం చూసామన్నారు. గత ప్రభుత్వ అధికారంలో 2019లో అన్న క్యాంటీన్లను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యగా మంత్రి పేర్కొన్నారు. ఆనాడు పాలకొల్లులో అన్నా క్యాంటీన్లు మూసివేసిన రోజునే తాను తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లను నిర్మించామని తెలిపారు. అదేవిధంగా ఆదిరెడ్డి శ్రీనివాసు నేతృత్వంలో రాజమండ్రిలో కూడా అన్న క్యాంటీన్ నిర్వహించడం జరిగిందన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు నిర్వహణ వల్ల ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు కేవలం ఐదు రూపాయలతో ఒక పూట ఆకలి తీర్చడం సాధ్యం అయిందనీ మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు.
మంత్రి వెంట శాసనసభ్యులు శ్రీనివాస్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News