-ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య -మంత్రి సుభాష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపరేషన్ సిందూర్ కోసం భారత బలగాలు తీసుకున్న నిర్ణయం పట్ల దేశం యావత్తు అండగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ విషయమై ప్రస్తావిస్తూ ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని మంత్రి పేర్కొన్నారు. కశ్మీర్లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్దేశం అండగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై దేశ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్నారు. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది- జైహింద్ అని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News