-సచివాలయ సిబ్బందికి ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక
గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత గృహ పథకం అమలు లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మి హెచ్చరించారు. గంపలగూడెం మండలం ఉటుకురు గ్రామం లోని గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం నత్తనడకన సాగడంపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతీ ఒక్కరూ వినియోగించుకునేల చర్యలు తీసుకోవాలని అదేశించినప్పటికీ, ఉటుకురు గ్రామంలో 980 మంది ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని, అర్హులకు అవగాహన కలిగించి వెంటనే పధకం అమలులో పురోగతి సాధించాలన్నారు. వాలంటీర్లు అర్హులైన ప్రతీ ఒక్కరు దగ్గరకు వెళ్లి పథకాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిధిలో గతంలో వివిధ గృహ నిర్మాణ పధకాల కింద నిర్మించిన ప్రభుత్వ గృహాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. ఆ గృహంలో లబ్దిదారుడే నివాసం ఉంటున్నాడా, లేక వారసులు ఉంటున్నారా, లేదా ఇతరులకు విక్రయిస్తే, కొనుగోలు చేసినవారు ఉంటున్నారా అనేది పరిశీలించాలన్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న వ్యక్తికే ఇంటిపై పూర్తి హక్కు అందించే ప్రయత్నమే జగనన్న శాశ్వత గృహహక్కు పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ ప్రక్రియను డిసెంబర్, మూడోవారం నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో తహసిల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News