గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవే వస్తున్నాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా 52 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 13, ఇంజినీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 12, ప్రజారోగ్య విభాగం 5, ఉపా సెల్ విభాగం 2, పరిపాలన విభాగం 1, అకౌంట్స్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సి.హెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, మేనేజర్ బాలాజీ బాషా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News