గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని, ప్రతిరోజూ ఉదయం 6లోపే హాజరు ప్రక్రియ పూర్తిచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కెవిపి కాలనీ, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఏటుకూరు, వస్త్ర నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, కార్మికుల హాజరుపై ప్రజారోగ్య అధికారులకు, డ్రైన్లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధిపై ఇంజినీరింగ్ అధికారులకు, మొక్కలు నాటడంపై ఏడిహెచ్ కి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి హాజరును కార్మికుల జీతాలతో అనుసంధానం చేయనున్నందున, ఏ కార్మికుడికి జీతం అందకపోయినా సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని ఖాళీ స్థలాలను వెంటనే శుభ్రపరచి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంబడి విస్తృతంగా మొక్కలు నాటేందుకు పిన్ పాయింట్ ప్రోగ్రాం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, పార్కుల అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలాలను గుర్తించి మార్కింగ్ పూర్తి చేయడం పట్టణ ప్రణాళిక అధికారుల బాధ్యత అని స్పష్టం చేస్తూ, ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏటుకూరు చెరువు వాకింగ్ ట్రాక్ను ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ట్రాక్ వెంబడి మొక్కలు నాటడంతో పాటు అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గాయత్రి నగర్ ప్రాంతంలో తాగునీటి సమస్యపై స్థానికులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రతిరోజూ తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సంబంధిత ఏఈని ఆదేశించారు. నగరంలో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా, హరిత వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ వేణుగోపాల్, డిఈఈ సతీష్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఎస్ఎస్ లు రాజేష్, అయూబ్ ఖాన్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News