-రూ.25 కోట్లతో రాయచోటిలో అంతర్జాతీయ క్రీడా సముదాయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి
-24.90 ఎకరాల్లో హాకీ, ఫుట్బాల్ క్రీడా మైదానాల ఏర్పాటుకు కేంద్ర సహకారం కోరిన మంత్రి
-డిల్లీ లో కేంద్ర యువజన, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే గారితో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ మైదానం, ఫుట్బాల్ మైదానం, ఫ్లడ్లైట్లు, ప్రేక్షకుల గ్యాలరీతో కూడిన అత్యాధునిక క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే ని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సహకారం కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాల ఫుట్బాల్ మైదానం లేదని పేర్కొన్నారు. రాయచోటిలో ఇందుకోసం 24.90 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, సుమారు రూ.25 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని వివరించారు. రాయచోటి, పరిసర ప్రాంతాల్లో ఫుట్బాల్, హాకీ క్రీడల్లో విశేష ప్రతిభ కలిగిన యువతకు ఈ క్రీడా సముదాయం ఎంతో ఉపయోగపడుతుందని, జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంటూ, దీనికి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిపాలనా అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News