గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ నియోజక వర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ (C.M.Saikanth Varma) తెలిపారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుకు పొన్నూరు మినహా అన్ని నియోజక వర్గాలలో భూములను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో ఒక్కో మోడల్ లో ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా ఎగుమతుల ప్రణాళిక ప్రతిపాదించడం జరిగిందన్నారు. దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు.
డి.ఐ.ఇ.పి.సి సమావేశంలో 11 ఎం.ఎస్.ఎం.ఇ సంస్థలకు పెట్టుబడి, వడ్డీ, విద్యుత్, సాంకేతిక అప్ గ్రేడేషన్ కింద రూ.1.53 కోట్ల రాయితీకి ఆమోదం తెలియజేసింది. జూలై 4 నుండి 30వ తేదీ వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ లో అందిన 55 దరఖాస్తులలో 24 దరఖాస్తులను నిర్దేశిత సమయంలో ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఉప సంచాలకులు ప్రదీప్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం, మెప్మా పి.ఓ సింహాచలం, పర్యాటక అధికారి రమ్య, ఎ.పి.ఐ.ఐ.సి జోనల్ మేనేజర్ నరసింహారావు, రవాణా శాఖ అధికారి పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ లు సి.హెచ్.రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News