అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు రోజుల పర్యటనలో భాగంగా, ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం తొలి రోజు సోమవారం, 2026 ఆగస్టు 3న ప్రజారాజధాని అమరావతిలో పర్యటించింది.
పర్యటనలో భాగంగా ఉదయం రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో ESMU విభాగ అధికారులతో WB& ADB బృందం సమీక్ష నిర్వహించింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొంటున్న గుత్తేదారు సంస్థలు నిర్వహిస్తున్న క్యాంపు సైట్లలో కార్మికుల భద్రతకు అనుసరిస్తున్న విధానాల గురించి ఈ సమీక్షలో చర్చించింది. అలాగే రాజధాని అమరావతి నగర పరిధిలో సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల అమలు గురించి చర్చించింది. సమావేశంలో APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ డైరెక్టర్ వెలుగోటి రాములు, స్ట్రాటజీ విభాగ ముఖ్యాధికారి అడుసుమిల్లి ఉమ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆయా అంశాల అమలుపై పలు సూచనలు ఇచ్చి..వాటి అమలు బాధ్యతలపై APCRDA, ADCL, PgMC, PMCలు నిర్వహించాల్సిన క్రియాశీలక పాత్ర గురించి WB& ADB బృందంలోని సభ్యులు వివరించారు.
అనంతరం రాజధాని అమరావతిలోని పలు ప్రాజెక్టు సైట్లను WB& ADB బృందంలోని సభ్యులు సందర్శించారు. ఆయా సైట్ల వద్ద భద్రతా ప్రమాణాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి.. అధికారులకు, గుత్తేదారు సంస్థల ప్రతినిధులకు పలు సూచనలిచ్చారు. పని చేసే ప్రదేశాల వద్ద కార్మికులకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు, PPE కిట్ ధరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. నిర్మాణ పనుల ప్రాజెక్టుల వద్ద సంచరించే భారీ వాహనాల నిర్వహణలో, స్థానిక ప్రజల భద్రతకు అనుసరించాల్సిన విధానాల గురించి అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలను తెలియజేశారు.
Prajavartha Online Telugu News