-ప్రభుత్వ విజయాలను ఇంటింటికి చేర్చడంలో వారిదే కీలక పాత్ర
-మంగళగిరిలో యూనిట్ ఇన్చార్జిల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న మాజీ మంత్రి
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్టీ శ్రేణులను ఉత్తమ ప్రజా నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ యూనిట్ ఇన్చార్జిల శిక్షణా తరగతుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ సిద్ధాంతాలు, ప్రజలతో మమేకమయ్యే విధానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించే నైపుణ్యాలు, సంస్థాగత బలోపేతానికి అవసరమైన నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అసలైన బలం నాయకుల్లో కాదని, నిస్వార్థంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తల్లోనే ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసే సమర్థవంతమైన ప్రజా నాయకుడిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించి ఇంటింటికీ చేర్చడంలో కుటుంబ సాధికార సారధులు, బూత్ కమిటీలు, యూనిట్ ఇన్చార్జిల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.’ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News