విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పరిధిలో ఇంటింటి ఓటర్ల ధృవీకరణ (హౌస్ టు హౌస్ వెరిఫికేషన్) ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ఈ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు నగర పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, సంబంధిత పోలింగ్ స్టేషన్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) కార్యాలయాలలో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రతి ఓటరు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, వయస్సు, లింగం తదితర వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ఒకవేళ ఓటర్ల వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నా, పేర్లు చేర్చుకోవాల్సి ఉన్నా, తొలగింపులు, సవరణలు చేయించుకోవాల్సి ఉన్నా లేదా ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉన్నా వెంటనే సంబంధిత బూత్ లెవెల్ అధికారి (BLO)ని సంప్రదించి నిర్ణీత దరఖాస్తు ద్వారా తెలియజేయాలని కోరారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను సరిచూసుకొని అవసరమైన మార్పులు చేసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తెలియజేయడానికి ఆగస్టు 30, 2026 చివరి తేదీ అని కమిషనర్ తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా సంబంధిత బీఎల్వోను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Prajavartha Online Telugu News