గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వర్షపు నీరు నిలిచిపోకుండా, డ్రైనేజీ వ్యవస్థ సజావుగా సాగేలా చూడటంలో భాగంగా మేజర్, మీడియం డ్రైన్లలో రెండో విడత పూడికతీత పనులను పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో మొత్తం 64 కిలోమీటర్ల మేజర్ డ్రైన్లు, 123 కిలోమీటర్ల మీడియం డ్రైన్లలో ఈ ఏడాది పూడికతీత కాంట్రాక్ట్ నిబంధనల్లో భాగంగా పనులు పూర్తయిన తర్వాత కూడా 90 రోజుల పాటు సదరు డ్రైన్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దే ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలను పొందుపరిచామన్నారు. ఈ నిబంధనల మేరకు సదరు కాంట్రాక్టర్ల ద్వారానే రెండో విడత పూడికతీత పనులను తక్షణమే చేపట్టాలన్నారు. ఇప్పటికే 13 వార్డ్ ల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయని, డ్రైన్ల పూడికతీత జరుగుతున్న ప్రతి పాయింట్ వద్ద ఏఈలు, సచివాలయాల ఎమినిటీ కార్యదర్శులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి లోపాలు, నాణ్యతా లోపాలు లేదా నిర్లక్ష్యం గుర్తించినా సంబంధిత అధికారులే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని, వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News