-రూ.12.60 కోట్ల నిధులు మంజూరు
-జనవాణి, వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి డిగ్రీ కళాశాల సమస్యలు
-చెట్ల కింద పాఠాలు చెబుతున్న దుస్థితిపై నాడు గళం విప్పిన పవన్ కళ్యాణ్
-నేడు శాశ్వత భవన నిర్మాణానికి బాటలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలపై శ్రద్ధ.. పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక శైలి. విన్న సమస్య, గుర్తుపెట్టుకుని మరీ పరిష్కారం చూపుతారు. ఏలూరు డిగ్రీ కాలేజీ తరగతి గదుల లేమి సమస్య అదే కోవకు వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరంతర ప్రజా ప్రస్థానంలో భాగంగా జనవాణి, వారాహి యాత్రల్లో ఏలూరు డిగ్రీ కళాశాలలో కనీసం తరగతి గదులు లేక తాము పడుతున్న అవస్థలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చెట్ల కింద పాఠాలు చెబుతున్న దైన్య స్థితిపై నాడు పవన్ కళ్యాణ్ గళం విప్పారు. అలాగే దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులు పడుతున్న అవస్థలు విని చలించారు. అధికారం చేపట్టిన తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని విద్యార్థి సంఘాలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకొంటూ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. పవన్ కళ్యాణ్ చొరవ- ఉనికిని కోల్పోతున్న ఉన్నత విద్యాలయానికి కొత్త ఊపిరి ఇచ్చింది.
ఏలూరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News