అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు మరింత సులభంగా పొందడానికి వీలుగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వారు తామున్న చోటు నుంచి కేవలం తమ మొబైల్ ఫోను ద్వారా ఇకపై ఈ పనులు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం దివ్యాంగుల కొరకు సదరం సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే వీలు కల్పించినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్, స్లాట్ లభ్యత సమయం, సర్టిఫికెట్ డౌనులోడు సేవల కోసం వారు ఏ కార్యాలయానికి వెళ్లనవసరం ఉండదు. వారున్న చోటు నుంచే తమ మొబైల్ ఫోనులోని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్షణాల్లో ఈ పనులు చక్కబెట్టుకోవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
ఎలా తెలుసుకోవచ్చు అంటే
*ముందుగా మీ మొబైల్ నంబరులోని వాట్సాప్ ఓపెన్ చేయాలి
అందులో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ *9552300009 కు హాయ్ అని మెసేజ్ పంపాలి
*తర్వాత మీకు మొబైల్ ఫోనులో కనిపించే సిటిజన్ సర్వీసుల్లో సదరం సర్వీసులను ఎంపిక చేసుకోవాలి
*అందులో మీకు సదరం స్లాట్ అవైలబిలిటీ, సదరం స్లాట్ బుకింగ్, సదరం సర్టిఫికెట్ డౌన్ లోడు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు ఏది అవసరమైతే దాన్ని ఎంపిక చేసుకోవాలి.
*అందులో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు
* సదరం సర్టిఫికెట్ కావాలంటే మీరున్న చోటునుంచే సర్టిఫికెట్ డౌన్లోడు చేసుకోవచ్చు
*సదరం స్లాట్లు ఎప్పుడు అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
అక్కడ ఆ సేవలు పొందడానికి కావాల్సిన వివరాలు పొందుపరిస్తే మీరు వెంటనే నిమిషాల్లో ఆ సేవలను మీ మొబైల్ సేవలు పొందే వీలుంటుంది. దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Prajavartha Online Telugu News