చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ప్రాధాన్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, మందుల లభ్యత, ప్రసూతి సేవలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, వైద్య రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. రోగుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మందులు అవసరమైన వైద్య సేవలు ఎలాంటి లోటు లేకుండా అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News