– MSME DPR యాప్ను స్త్రీ నిధి యాప్తో అనుసంధానంపై చర్చ
– ప్రాసెసింగ్ చార్జీల మాపీపై SHG మహిళలకు అవగాహన కల్పించాలన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం ఏపీ బ్రాండ్ కింద SHG మహిళలు తయారు చేసిన 65 ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సెర్ప్ డైరెక్టర్లతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి SHG మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఎగుమతి, ముడిసరుకులు దిగుమతి చేసుకునే అవకాశాలు తెలుసుకునేందుకు APNRTSతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహన నమూనాలో సౌరశక్తితో నడిచే మొబైల్ లాండ్రీ యూనిట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి దానిని PMEGP కింద ఒక సంస్థాగత వ్యాపారంగా ప్రోత్సహించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల మహిళలచే వ్యాపార, సేవా మరియు పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసే పురోగతిపై సమీక్షించి… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త ” దృక్పథానికి అనుగుణంగా కార్యక్రమ అమలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి, అక్కడ లైవ్లీహుడ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని… గ్రామీణ మహిళలు మరియు యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. NRLM కింద FPO స్థాయిలో స్థాపించిన 163 కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHCs) పనితీరును సమీక్షించి, రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
MSME అభివృద్ధి చేసిన DPR తయారీ యాప్ను స్త్రీ నిధి యాప్తో అనుసంధానంతో పాటు, SHG బ్యాంక్ లింకేజీ ప్రగతిని సమీక్షించి, SHG సభ్యులకు సంస్థాగత రుణాలు సులభంగా, నిరంతరంగా అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్లు SHG క్యాష్ క్రెడిట్ లిమిట్ (CCL) రుణాలపై వసూలు చేస్తున్న లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్స్పెక్షన్ ఛార్జీల మినహాయింపు గురించి SHG మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన అన్ని SHGలు ఈ మినహాయింపుల ప్రయోజనాన్ని పూర్తిగా పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి ఆదేశించారు.
Prajavartha Online Telugu News