అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ఆధ్వర్యంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా NID విద్యార్థులచే ఆకర్షణీయమైన చేనేత ఫ్యాషన్ షో,డిజైనింగ్ లో పలు పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వీవర్స్ సర్వీస్ సెంటర్ డీడీ అనస్ షా. బి. మాట్లాడుతూ భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, డెవలప్మెంట్ కమిషనర్ (చేనేత) కార్యాలయం పరిధిలోని చేనేత సేవా కేంద్రం (WSC), విజయవాడ ఆధ్వర్యంలో 12వ జాతీయ చేనేత దినోత్సవంను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.1905 నాటి చారిత్రాత్మక స్వదేశీ ఉద్యమాన్ని స్మరించు కోవడానికి మరియు దేశ సాంస్కృతిక జౌళి వారసత్వాన్ని పరిరక్షించడంలో భారతీయ చేనేత నేతకారుల అమూల్యమైన రంగాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపు కుంటున్నామన్నారు.అసలైన చేనేత ఉత్పత్తులపై అవగాహన పెంచడం, సాంప్రదాయ నేత రీతులను అభినందించేలా యువతను ప్రోత్సహించడం మరియు చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం మన లక్ష్యమన్నారు.భారతదేశ సంపన్న చేనేత వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం మరియు మద్దతు ఇవ్వడం అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు.
భారతీయ చేనేత రంగానికి చెందిన సౌందర్యాన్ని, నైపుణ్యాన్ని, ఆవిష్కరణలను మరియు సుస్థిరతను ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలన్నారు.కళాశాల ఆవరణలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, ప్రత్యక్ష నేత ప్రదర్శనలు, చేనేత క్విజ్ పోటీలు, డిజైన్ పోటీలు మరియు NID విద్యార్థులచే ఆకర్షణీయమైన చేనేత ఫ్యాషన్ షో / చీర కట్టుకునే పోటీలు నిర్వహించారు.
అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏడీ ఎన్. జ్ఞాన శేఖరన్, ఎన్ఐడీ అసోసియేట్ సీనియర్ ఫ్యాకల్టీ అర్నాబ్ సేనాపతి, టెక్నికల్ సూపరిండెంట్ బిశ్వజిత్ దీయాసీ, టెక్స్ టైల్స్ డిజైనర్ సమీర కుమార కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News