విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ ఈ ఎల్ సి చర్చి రాజ్యాంగాన్ని యధాతధంగా పాటించాలని, వెంటనే ఏ ఈ ఎల్ సి రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహించాలని పాస్టర్ మోజస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ సెంటర్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 మంది పాస్టర్లపై తీసుకున్న చర్యలను పునః సమీక్షించాలని వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏఈఎల్సి చర్చి పరిపాలనలో పూర్తిస్థాయి పారిదర్శకతను తీసుకురావాలని ,సహజ న్యాయ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు .చర్చి ఆస్తులు, లీజులు, నియామకాలు నిర్ణయాలపై జవాబుదారీతనం ఉండాలని హైకోర్టు కేసులలో తుది నిర్ణయం వచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ప్రస్తుతం తాత్కాలిక యాజమాన్యం చేస్తున్న చర్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి 300 పాస్టర్ల కుటుంబాలను అండగా నిలవాలని ఆయన కోరారు. తదనంతరం చర్చి పాస్టర్లు మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ చేసిన దీర్ఘకాలిక లీజ్ రిజిస్ట్రేషన్ వెనుక కొన్ని కోట్ల రూపాయలు మారే అవకాశాలు ఉన్నాయని దానిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇప్పటివరకు ఏ ఈ ఎల్ సి రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన పాస్టర్ల ట్రాన్స్ఫర్ లలో అవకతవకలను పరిశీలించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇది వ్యక్తుల మీద పోరాటం కాదు, ఇది చర్చి రాజ్యాంగం కోసం హైకోర్టు ఆదేశాల అమలు కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేస్తున్న పోరాటమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోడి మోజెస్, దాసరి నవీన్, కూకట్లపల్లి రాబర్ట్ , పురుషోత్తం చౌదరి, ఏ ఈ ఎల్ సి సంఘ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, సేవలు నుండి తొలగించబడిన పాస్టర్లు, ఏ ఈ ఎల్ సి విశ్వాసులు, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News