విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యార్థులకు హెచ్ఐవీ/ఎయిడ్స్పై సరైన అవగాహన కల్పించడం ద్వారా అపోహలు, భయాలను తొలగించవచ్చని వి.రాజమోహన్, ప్రాజెక్ట్ మేనేజర్, వాసవ్య మహిళా మండలి తెలిపారు. కానూరులోని మండల పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ/ఎయిడ్స్పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని 60 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వివిధ కార్యక్రమల ద్వారా అవగాహన ను కల్పిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
హెచ్ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే వైరస్. హెచ్ఐవీ గురించి సరైన సమాచారం తెలుసుకోవడం ప్రతి విద్యార్థికి అవసరమని, తెలియని విషయాలపై భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా ఆరోగ్య నిపుణులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. హెచ్ఐవీ కరచాలనం చేయడం, కౌగిలించుకోవడం, కలిసి కూర్చోవడం, కలిసి భోజనం చేయడం లేదా ఒకే తరగతి గదిలో ఉండడం ద్వారా వ్యాపించదు. అందువల్ల హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులను దూరంగా పెట్టడం లేదా వారిపై వివక్ష చూపడం సరికాదని తెలిపారు.విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలని, శరీరానికి సంబంధించిన సందేహాలు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నమ్మకమైన పెద్దలు, ఉపాధ్యాయులు లేదా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
“సరైన సమాచారం తెలుసుకుందాం – అపోహలను తొలగిద్దాం – అందరినీ గౌరవిద్దాం” అనే సందేశంతో విద్యార్థులు హెచ్ఐవీపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన కలిగిన సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థులు కూడా ముఖ్యమైన భాగస్వాములని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయుడు మీర్జా అలీ అక్బర్, ఆరోగ్య కార్యకర్త కె. రాజేష్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News