-రోగులకు సౌకర్యాల కల్పనపై ఆరా
-న్యూ జీజీహెచ్ లో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం రాత్రి న్యూ జీజీహెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది అందుబాటు, రోగులకు సౌకర్యాలను పరిశీలించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు తక్షణ వైద్యం అందేలా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోగులు, వారి సహాయకులకు ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యంగా రోగులు, వారి బంధువులు వేచి ఉండే ప్రాంతాల్లో సీటింగ్ ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట అదనపు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఆసుపత్రి యంత్రాంగం తీసుకున్న చర్యలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో అవసరమైన వైద్యం అందించడం అధికారుల ప్రథమ బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రోగులు ఇబ్బందులు పడకూడదని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రఘునందన్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా. జె.సుమన్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News