గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 22, 23 మరియు 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రత్యేక క్యాంపెయిన్ డేస్లో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ముసాయిదా ఓటర్ జాబితాతో పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు వివరాలను ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటర్ జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణలు చేయించుకోవాలనుకునేవారు, అలాగే ముసాయిదా ఓటర్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు సంబంధిత పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న బిఎల్ఓలను సంప్రదించి తమ దరఖాస్తులను అందించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ను సద్వినియోగం చేసుకుని తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, ఓటర్ జాబితాలో ఏవైనా తప్పులు లేదా మార్పులు అవసరమైతే నిర్ణీత ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బిఎల్ఓలు నిర్దేశిత సమయంలో పోలింగ్ కేంద్రాల్లో ఉండి, ప్రజల నుండి అర్జీలు, దరఖాస్తులను తీసుకునేలా సూపర్వైజరీ అధికారులు, ఏఈఆర్ఓలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News