-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
సువర్ణ లంకా నగరం, ద్వారక, ఇంద్రప్రస్థం వంటి అద్భుత నగరాలను నిర్మించిన విరాట్ విశ్వకర్మ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేతి వృత్తుదారులకు ఆర్థిక మేలు కలిగేలా పథకాలు రూపొందిస్తూ, అభినవ విశ్వకర్మగా రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబునాయుడు నిర్మిస్తున్నారన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు ఆద్యుడు విశ్వకర్మ భగవానుడు అని అన్నారు. హిందూ పురాణాల ప్రకారం సత్యయుగంలో దేవతల నివాసానికి స్వర్గలోకం, త్రేతాయుగంలో సువర్ణ లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని, కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం, పాండవులు నివసించిన మయసభను విశ్వకర్మ నిర్మించారన్నారు. విశ్వకర్మ స్ఫూర్తితో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. చేతి వృత్తుదారులకు సీఎం చంద్రబాబు అండగా ఉంటూ, గీత, వడ్డెర, చేనేత, ఇతర వృత్తులకు ఆర్థిక మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. త్వరలో రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు. అభినవ విశ్వకర్మ సీఎం చంద్రబాబు అని కొనియారు. తెలంగాణాలోని సైబరాబాద్ నగరం నిర్మించడమే కాకుండా రాజధాని అమరావతి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరందించేలా పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబునాయుడు నిర్మిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. బీసీల ఆత్మ గౌరవం నిలిపేలా ఆయా సామాజిక వర్గాలకు చెందిన మహానీయుల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహిస్తున్నారు. విశ్వకర్మ జయంతిని కూడా రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంతిని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News