నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలు ప్రతీ మహిళా పాడి రైతు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో శుక్రవారం జగనన్న పాలవెల్లువ పథకంపై ప్రమోటర్లు, మహిళా పాడిరైతులు, సిబ్బందితో ఏర్పటుచేసిన అవగాహనా కార్యక్రమంలో జేసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడిరైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జగనన్న పాలవెల్లువ పాల కేంద్రానికి పాలు అందించే పాడి రైతులకు స్వల్పకాలిక రుణంగా 30 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. నిరంతరంగా పాలు అందించినట్లైతే పాడి పశువులు కొనుగోలుకు 2 లక్షల రూపాయల వరకు ధీరకాలిక రుణంగా మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాక అమూల్ సంస్థ నుండి మంచి పోషకాలతో కూడిన దాణాను సబ్సిడీపై అందించడంతో పాటు పాడి పశువులకు వైద్య సౌకర్యం కూడా కలిగిస్తారన్నారు. పాలకు లీటరుకు ప్రైవేట్ డైరీల కన్నా 5 నుండి 7 రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందని, నెలకు 3 నుండి 5 వేల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఇటువంటి ప్రయోజనాలన్నిటినీ పాడి రైతులకు తెలియజేసి గ్రామాలలో పాల సేకరణ మరింతగా పెంచాలని ప్రోమోటర్లను జేసీ ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ పధకం విజయవంతంలో ప్రమోటర్లు పాత్ర ప్రముఖమైనదని, మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రం లో ప్రమోటర్లుగా నియమించబడే వాళ్ళ ఎంపికలో ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం కేంద్రానికి పాలు సరఫరా చేసేవారు, కేంద్రం అభివృద్ధికి కృషి చేసేవారిని ప్రమోటర్లుగా ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ జి. రాణి, తహసీల్దార్ ఎల్లారావు, గ్రామ సర్పంచ్, పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News