గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనకు స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి, స్వచ్చ గుంటూరు సాధనలో అధికారులు, ప్రజల భాగస్వామ్యం అంశాలపై నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎంఎల్సీలు కెఎస్.లక్ష్మణరావు, సిహెచ్.ఏసురత్నం, ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ లతో కలిసి నగర కమిషనర్ నేతృత్వంలో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నగర విస్తీర్ణం, జనాభా, రోడ్లు, పార్క్ లు, జిఎంసి నుండి చేపడుతున్న త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, స్టేక్ హోల్డర్స్ సలహాలు, సూచనల మేరకు అధికారులను సమన్వయం చేసుకొని గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. నగరంలోను షుమారు 11.50 లక్షల జనాభాకి తగిన త్రాగునీటిని అందించలేక పోతున్నామని, ప్రధానంగా విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలకు సరిపడా నీటి సరఫరా జరగడంలేదన్నారు. త్వరలో ఏఐబి, అమృత్ ప్రాజెక్ట్ లో ఫేజ్ 1, 2లను పూర్తి చేస్తి త్రాగునీటి సమస్య పరిష్కారనికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిశంబర్ నాటికి గోరంట్ల కొండ మీద ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. పారిశుధ్యం అంశంలో నగరంలోని 2.50 లక్షల ఇళ్లను 786 మైక్రో ప్యాకెట్స్ గా విభజన చేసి ఒక్కో ప్యాకెట్ కి ఇద్దరు కార్మికులను కేటాయిస్తున్నామన్నారు. మైక్రో ప్యాకెట్ లో కేటాయించ బడిన కార్మికులే ఇంటింటి చెత్త సేకరణ, అంతర్గత డ్రైన్ల శుభ్రం చేస్తూ పూర్తి భాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేజర్ డ్రైన్లలో సిల్ట్ తీయడానికి ప్రత్యేకంగా కార్మికులను తీసుకుంటామని, వెహికిల్ షెడ్ లో ప్రతి వాహనం రన్నింగ్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ-ఆటోలు అన్నీ రన్నింగ్ లో ఉండేలా, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 3 నియోజకవర్గాల వారీగా కమర్షియల్ వ్యర్ధాల సేకరణకు వేరు వేరుగా టెండర్లు పిలుస్తామన్నారు. భవన వ్యర్ధాల తరలింపుకు త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తామని, జిటిఎఎస్ ల ఏర్పాటు కూడా వేగవంతం చేస్తామని తెలిపారు. శనివారం నుండి అమరావతి రోడ్ కి ఇరువైపులా రోడ్, డ్రైన్ ఆక్రమణలను తొలగింపు చేస్తామని, ఇప్పటికే ఆక్రమణదారులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.
ఎంఎల్సీ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ గుంటూరు నగరానికి సరిపడా త్రాగునీరు ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థ పటిష్టంగా లేక పోవడం వలన ప్రజలు పూర్తి స్థాయిలో నీటిని అందించ లేక పోతున్నారన్నారు. అలాగే నగరంలో త్రాగునీటి పైప్ లైన్లు, డ్రైనేజి లైన్లు ఒకే చోట ఉన్న వాటిని వెంటనే షిఫ్ట్ చేయాలన్నారు. గోరంట్ల వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలన్నారు.
ఎంఎల్సీ ఏసురత్నం గారు మాట్లాడుతూ రాజధాని అమరావతికి చేరువగా ఉన్న గుంటూరులో అభివృద్ధి పనులు ప్రణాళికాబద్దంగా జరగాలన్నారు. కృష్ణా నది నుండి నీటిని నల్లపాడులోని 110 ఎకరాల చెరువుకి పంపింగ్ చేస్తే గ్రావిటి ద్వారా నగరానికి నీటిని అందించవచ్చని, అందుకు షుమారు రూ.150 కోట్లు ఖర్చు అవ్వచ్చన్నారు.
ఎంఎల్ఏ నసీర్ గారు మాట్లాడుతూ శివారు ప్రాంతాలు, ప్రగతి నగర్ ప్రాంత ప్రజలకు త్రాగునీటిని అందించాల్సిన అత్యావశ్యకత ఉందన్నారు. నగరంలో ప్రత్యేకంగా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ ని ఏర్పాటుకు కౌన్సిల్ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపాలన్నారు. పట్టాలు లేని ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఆక్రమిత పన్ను విధించి నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.
సమావేశ అనంతరం స్టేక్ హోల్డర్స్ నుండి అర్జీలు, సూచనలు వ్రాత పూర్వకంగా తీసుకొని, stakeholders.gunturcorporation@gamil.com కి మెయిల్ ద్వారా కూడా తమ సూచనలను అందించ వచ్చని, సూచనల మేరకు నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. నాగ మల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టిడిపి ఫ్లోర్ లీడర్ కె.రవీంధ్ర, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News