– మీకోసం పోర్టల్ లో గ్రీవెన్స్ నమోదుకు సమీప సచివాలయాన్ని సంప్రదించొచ్చు.
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా – గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిన తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల మూడవ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ప్రతి సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టం కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీశ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రజలు తమ అర్జీని మీకోసం ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చని.. ఇందుకు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News