-ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో ప్రతిష్టాత్మకంగా ‘అమరావతి చిత్రకళా వీధి’
-ఈ కళా ఉత్సవం ద్వారా కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కళా ఉత్సవం ‘అమరావతి చిత్రకళా వీధి’లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, కళాకారుల సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ భారీ కళా ఉత్సవాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఆగష్టు 8 మరియు 9 తేదీలలో (శని, ఆదివారాలు) ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొరిటేపాడు – విద్యానగర్ రోడ్డులో ఈ కళా ఉత్సవం జరుగుతుందన్నారు. ఇందులో ప్రధానంగా సందర్శకులు స్వేచ్ఛగా తిలకించేలా ప్రత్యేక సాంస్కృతిక వీధి నిర్మాణం, దేశం నలుమూలల నుండి విచ్చేసే వివిధ రకాల చిత్రకళా ఉత్పత్తులు, హస్తకళల ప్రదర్శన మరియు విక్రయాలకోసం 800 కు పైగా స్టాల్స్, నిర్విరామంగా సాగే ప్రత్యక్ష కళారూపాలు, సంగీత విభావరి, వినోద కార్యక్రమాలకు 9 కళా వేదికలు, లైవ్ ఆర్ట్ ఇన్స్టాలేషన్స్, ప్రత్యేక ఫోటోబూత్లు, విభిన్న రుచులతో కూడిన ఫుడ్ కోర్టులు ఉంటాయన్నారు.. గత ఏడాది రాజమహేంద్రవరంలో నిర్వహించిన చిత్రకళా వీధికి అపూర్వ స్పందన లభించిందని, ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది రాష్ట్ర ప్రజారాజధాని అమరావతికి అతిసమీపంలో ఉన్న గుంటూరులో మరింత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయడానికి ఎంతో తోడ్పడతాయని ఉద్ఘాటించారు. ఈ అద్భుత కళా ప్రదర్శనకు కళాభిమానులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై, ఏపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుకను విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
పోస్టర్ ఆవిష్కరణలో ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ పొడపాటి తేజస్వి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News