-కులమతాలకు అతీతంగా చాపకూడు కార్యక్రమం అందరికీ ఆదర్శం
-పల్నాడు వీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలి
-పల్నాడు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
-900 ఏళ్ల పల్నాడు వీరుల చరిత్ర రాష్ట్రానికే గర్వకారణం
– మంత్రి గొట్టిపాటి రవి కుమార్
కారంపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
900 సంవత్సరాలపై బడిన పల్నాడు యుద్ధ వీరుల చరిత్ర రాష్ట్రానికే గర్వ కారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో బుధవారం పల్నాటి యుద్ధ వీరుల ఆరోధనాత్సవాల్లో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో పాటు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధ వీరులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పల్నాటి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది శతాబ్ధాలపైగా చరిత్ర కలిగన పల్నాడు యుద్ధ వీరుల విశేషాలను ముందు తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికే గర్వకారణమైన పల్నాటి యుద్ధ వీరుల చరిత్రను దేశవ్యాప్తంగా ప్రాచూర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
గ్రీస్ వీరులకు సమానంగా పల్నాడు యుద్ధ వీరులు…
యుద్ధ వీరులను పూజించే సంప్రదాయం ప్రపంచంలో ఒక్క గ్రీస్ దేశంలోనే ఉండేదని… గ్రీస్ వీరుల ధైర్య, సాహసాలకు, యుద్ధ రీతులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతలు ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదే విధంగా గ్రీస్ తరువాత యుద్ధ వీరులను పూజించే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని… పల్నాడు జిల్లా కారంపూడిలోనే ఉండటం ఎంతో గొప్ప విషయం అన్నారు. అప్పట్లోనే పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుతూ చాపకూడు కార్యక్రమాలు నిర్వహించే వారని తెలిపారు. కులమాతాలకు అతీతంగా సర్వమత సమానత్వం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చారిత్రాత్మకం అని మంత్రి కొనియాడారు. అదే విధంగా పల్నాడు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి యుద్ధ వీరుల ఆరాధనోత్సవాలకు పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు పర్యాటక మంత్రితో కూడా చర్చిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News