-గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి శుక్రవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ అవకాశాన్ని సదరు గ్రామాలలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరక్ష్యరాసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 43 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల రెవెన్యూ, సంబందిత అధికారులు పాల్గొని విజయవంతంగా రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 5720 అర్జీలు అందాయని అందులో నేడు 593 అర్జీలు వచ్చాయని అందులో ప్రభుత్వ భూ ఆక్రమణలపై -2, అలైనేషన్ పై-2, హౌస్ సైట్స్ పై – 10, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ పై -57, రీ సర్వే పై -22, GSWS పై -14, ఆర్ ఓ ఆర్ పై -361, ఇతర విషయాలకు సంబంధించి 81 వచ్చాయని తెలిపారు. ఈరోజు వచ్చిన అర్జీలలో 7 అర్జీల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News