గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడవు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ కృష్ణ నగర్, స్తంభాల గరువు, పట్టాభిపురం ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్ల నిర్మాణం డ్రైన్ టు డ్రైన్ చేయాలని, డ్రైన్లను లెవల్ సరిగా ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. డ్రైన్ల మీద నిర్మాణం చేసే కల్వర్ట్ ల వద్ద మురుగు పారుదల సక్రమంగా ఉండడంలేదని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణం అనంతరం డెబ్రిస్ ని తొలగించాలని, సచివాలయాల వారిగా ఎక్కడైనా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయాలని గుర్తిస్తే ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎమినిటి కార్యదర్శులను ఆదేశించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్లకు ఇరువైపులా డ్రైన్ నిర్మాణం చేయాలని, ఆక్రమణదారులకు నోటీసులు అందించి స్వచ్చందంగా తొలగించుకోవాలని తెలియచేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పట్టాభిపురం మెయిన్ రోడ్ నుండి డిఆర్ఎం ఆఫీస్ వరకు రోడ్, డ్రైన్, శ్యామలా నగర్ గేటు నుండి డిఆర్ఎం ఆఫీస్ వైపు డ్రైన్ నిర్మాణం కోసం ప్రజల నుండి పలు అర్జీలు అందుతున్నాయని, తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పట్టాభిపురంలోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ని పరిశీలించి, మరమత్తు పనులపై నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించారు. అనంతరం తుఫాన్ నగర్ రోడ్ లోని క్రైస్తవ శ్మశానవాటికను పరిశీలించి, నడక దారిని సిసి రోడ్ వేయాలని, బోరింగ్ పంప్ మరమత్తు చేయాలని, గేటు ఏర్పాటు చేసి, జంగిల్ క్లియర్ చేయాలని డిఈఈ ని ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ ఈ.వరప్రసాద్, ఈఈ కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, డిఈఈ మధుసూదన్, శ్రీనివాసరావు, ఏసిపి రెహ్మాన్, ఆర్ఓ బాలాజీ బాష, ఏఎంహెచ్ఓ ఆనంద కుమార్, టిపిఎస్ సత్యనారాయణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News