-అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుంది
-జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృధా చేశాడు
-ప్రచార పిచ్చితో సాక్షి పత్రికకు రూ. 1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టాడు
-జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్ ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లు
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ అధినేత జగన్ రెడ్డి జల్సాలు, అవినీతితో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయం చేయాలంటూ.. రాష్ట్రం నలుమూలల నుంచి జగన్ బాధితులు ఎన్టీఆర్ భవన్ కు బారులు తీరుతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ భూ దందాలు, ఆర్థిక నేరాల నుంచి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారని మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలకులు ఉద్దేశపూర్వకంగా చేసిన అక్రమాలకు ప్రజలు బలయ్యారని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కమీషన్ల పాలన, ఆర్థిక నేరాలతో రాష్ట్రం దివాళా దీసే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృధా చేశారన్నారు. ప్రచార పిచ్చితో సాక్షి పత్రికకు రూ. 1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లని వ్యాఖ్యానించారు.
అభివృద్ధికి తెచ్చిన అప్పుల్లోనూ జగన్ చేతివాటం
రాష్ట్ర అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల్లోనూ కమీషన్లతో చేతి వాటం చూపారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రూ. పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్య శ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజ్ రియంబర్స్మెంట్కు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపుపాలన కారణంగా రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని దుస్థితి దాపురించిందన్నారు. జగన్ రెడ్డి చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ. 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతులకు తీరని నష్టం చేసిందని తెలిపారు. గత ఐదేళ్లలో ఇరిగేషన్ శాఖకు చెందిన కాంట్రాక్టర్లకు రూ.19,000 కోట్లు మేర వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.., ఈ బకాయిల ప్రభావం ప్రస్తుత ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
చిన్నారుల చిక్కీలను బొక్కేశారు…
చిన్నారులకు అందించే చిక్కీలు, కోడిగుడ్ల నిధుల్లోనూ జగన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం గోల్ మాల్ చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. చిక్కీలు, కోడిగుడ్ల కొనుగోళ్లలో దాదాపు రూ.256 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. జే బ్రాండ్ పేరుతో లిక్కర్, 22ఏ భూ దందా, టీడీఆర్ బాండ్లు, విద్యుత్ ఒప్పందాల కుంభకోణం, ఇసుక దోపిడీతో సామాన్యులు రాష్ట్రంలో జీవించలేని పరిస్థితులు తీసుకువచ్చారని మంత్రి పేర్కొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వస్తున్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా, బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.