మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పిల్లల్లోని నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో వైద్య, విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపాన్ని అధికమించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజున ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు, కిశోర బాలలకు ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ వయసు వారికి ఎంత డోసు మాత్రలు ఇవ్వాలనేది ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కల్పించి మాత్రలు సక్రమంగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం అవగాహన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్ శర్మిష్ట, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, డీఈవో పీవీజే రామారావు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News