-ఉద్యోగ ఖాళీల భర్తీ పదోన్నతల అంశం ప్రభుత్వానికి తీసుకు వస్తాం.
-ఏపీ ఎన్జీజీఓ నేతలు కె.వి. శివారెడ్డి, ఎ. విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఏపీ ఎన్జీజీఓ సంఘంలో నాలుగవ తరగతి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని సంఘానికి నాలుగో స్తంభం మైన నాల్గోతరగతి ఉద్యగుల సంక్షేమం ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తామని ఎన్జీజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం శనివారం గాంధీనగర్ లోని ఎన్జీజీఓ హోమ్ లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ప్రారంభ కాలం నుంచి ఎన్జిజీవో సంఘానికి మద్దతుగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలలో ఉద్యోగులు నిస్వార్ధంగా పాలుపంచుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగుల సమస్యలు దశలవారీగా పరిష్కారంఅవుతాయనే నమ్మకం ఏర్పడిందన్నారు. ఇటీవల ప్రభుత్వ పెద్దలను తరచుగా కలుస్తున్న సందర్భాలలో వారు కూడా ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను వీలైనంత సత్వరమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, గత ప్రభుత్వ పాలనలో జరిగిన ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారన్నారు. గత ఐదేళ్లుగా ఉద్యోగులకు నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలను ఒకేసారి చెల్లించమని ప్రభుత్వాన్ని కోరడం కూడా సమంజసం కాదనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నామని వివరించారు. సంక్రాంతి పండుగ సమయంలో 1820 కోట్లకు పైబడి పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన కొన్ని బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులకు రావలసిన బకాయిలలో మరింత భారీ మొత్తాలు విడుదల చేసేలా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో నాలుగవ తరగతి ఉద్యోగులు నిజానికి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఏ కార్యాలయంలో నైనా సరే నాలుగో తరగతి ఉద్యోగులు లేకపోతే ఆ కార్యాలయంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇంతటి కీలకపాత్ర పోషిస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగ స్థానాలు రాష్ట్రంలో 10,000 పైగా ఖాళీల గా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం, ఇదే క్రమంలో ఏళ్ల తరబడి నాల్గవ తరగతి ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంతోమంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, ఇటువంటి సమస్యలపై ఏపీ ఎన్జీజీఓ సంఘం ప్రభుత్వ పెద్దలను కలిసి డిమాండ్ చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావలసిన ప్రతి అంశాన్ని రాష్ట్ర సంఘం నిరంతరం ప్రభుత్వానికి తమ ఆవేదనను వివిధ రూపాల్లో తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ మాట్లాడుతూ నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీజీఓ ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఇందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఏపీ ఎన్జీజీఓ అధ్యక్ష, కార్యదర్శులను ఆత్మీయంగా సత్కరించుకున్నామ న్నారు. నాలుగవ తరగతి ఉద్యోగులుగా తమ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామన్నారు. నాలుగవ తరగతి ఉద్యోగ సంఘాలు జిల్లాలలో పటిష్టంగా ఉండేలా ఆయా జిల్లాల బాధ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం బలంగా ఉంటేనే అవసరమైన సమయాలలో ప్రభుత్వానికి మన బలం తెలియజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘాన్ని మరింత బలీయమైన శక్తిగా నిలబెట్టేందుకు నాలుగవ తరగతి ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు జి. నాగేశ్వరరావు, సహాధ్యక్షులు వి. ఎస్. సాయిరాం, ప్రధాన కార్యదర్శి కె. ఎస్. నారాయణ, కార్యదర్శి ఎన్. ఎల్లయ్య, జి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పి. శంకరరావు, కె. శ్రీనివాసరావు, బి. కాటమయ్య, కోశాధికారి యం. మాణిక్యాలరావు, కార్య నిర్వహణ అధికారి జి. గౌరి నాయుడు, విజయవాడ నగర అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు రమేష్ తదితరులతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News