-శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన దేవస్థాన ఈవో
-బ్రహ్మోత్సవాలకు సన్నద్ధతపై ఈ నెల 10 వ తేదీ మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలంలో అత్యంత వైభవంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖా మంత్రి కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, ఆలయ పండితులు మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీశైలంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది.
మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నద్దతపై ఈ నెల 10 వ తేదీన శ్రీశైలం ఆలయ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరగనుంది.. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న జాగ్రత్తలు, భద్రతా చర్యలపై ఆలయ ఈవోని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రికి శ్రీశైల మల్లిఖార్జున స్వామి – భ్రమరాంబ అమ్మవార్ల ప్రతిమను, ఆలయ డైరీ, క్యాలండర్ ను ఈవో అందజేయడం జరిగింది.. మంత్రికి స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆలయ పండితులు వేదాశీర్వచరం అందజేయడం జరిగింది..