-మంత్రులు, అధికారులు అందరూ దృష్టి పెట్టాలి
-అపరిష్కృత అర్జీలు లేకుండా చూసుకోండి
-అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
-మూడు జిల్లాల నుంచే అత్యధిక ఫిర్యాదులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి అందిన అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ ఎస్)పై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఆయన మాట్లాడుతూ అర్జీలు ఏవీ కూడా అపరిష్కృతంగా ఉంచకుండా అన్నిటిని పరిష్కరించాలన్నారు. దీనిపైన మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ విభాగం నుంచి ఎక్కువగా అర్జీలు వచ్చాయని, వాటి పరిష్కార మార్గాలు కనుగొనాలన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఆర్థికపరమైనవి, ఆర్థికేతరమైనవి ఎన్ని ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. కొంతమంది అధికారులు తమ వద్దకొచ్చిన అర్జీని కింది స్థాయి అధికారికో, పై స్థాయి అధికారికో బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారని ఇలాంటి ధోరణిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని తెలిపారు. ప్రజలు అర్జీలు ఇచ్చిన తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యను పరిష్కరించదగ్గదైతే దాన్ని పరిష్కరించాలి లేదా అది పరిష్కారం కాదనే విషయాన్ని ఆ అర్జీ ఇచ్చిన వారిని పిలిచి వివరంగా చెప్పి అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదులు పరిష్కారం చేయడంలో అవసరమైతే ఆయా శాఖల్లో సంస్కరణలు తీసుకురావాలన్నారు.
శ్రీకాకుళం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల నుంచే అత్యధికంగా అర్జీలు ఉన్నాయి. పల్నాడు, కృష్ణా జిల్లాల నుంచి అతి తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పీజీఆర్ ఎస్ గ్రీవెన్స్పైన ప్రజెంటేషన్ ఇచ్చారు. పీజీఆర్ ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో టాప్ పైవ్లో ఉన్నవన్నీ కూడా రెవెన్యూ సంబంధిత అర్జీలే ఎక్కువ ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 7,42,301 అర్జీలు వస్తే అందులో 60.7 శాతం పరిష్కారమయ్యాయని, 38.6 శాతం పరిష్కార క్రమంలో ఉన్నాయని, 0.87 శాతం ఫిర్యాదులు సమీక్షించాల్సి ఉందని చెప్పారు. రెవెన్యూలో మ్యుటేషన్లపైనే ఎక్కువగా 94,324 ఫిర్యాదులు వచ్చాయి. తర్వాత సర్వేసెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డులకు సంబంధించి 88,758, రెవెన్యూ రికార్డుల కరెక్షన్ల కోసం 71,059, పట్టాదారు పాసుపుస్తకాల కోసం 29,948 అర్జీలు వచ్చాయని చెప్పారు.
Prajavartha Online Telugu News