-పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం సాధ్యమవుతుంది
-గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము చెత్తతో సంపద సృష్టిస్తున్నాం
-8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం
-ఆడబిడ్డల జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టం, నేరస్తుల గుండెల్లో నిద్రపోతాం
-కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం
-వెలుగొండను పూర్తిచేసి కందుకూరుకు నీరందిస్తాం
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-నెల్లూరు జిల్లా కందుకూరులో స్వర్ణాంధ్ర -స్వచ్చాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీని స్వచ్చాంధ్ర చేయాలని సంకల్పించాం. స్వచ్ఛమైన ఆలోచనలతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలంతా నెలలో ఒక్కరోజైనా సమయం కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిందన్నారు. మహిళల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోమని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
స్వచ్చాంధ్ర లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రజాహితం, భావితరాల భవిష్యత్తు కోసమే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాము. ప్రతి ఇల్లు కూడా పరిశుభ్రంగా తయారై రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి. మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో మెరుగైన ఆరోగ్యం జీవనం పెంపొందించుకోవాలి. కలుషితమైన గాలి, పంట ఉత్పత్తుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రజల జీవన శైలిలో మార్పులు రావాలి. పంటల్లో రసాయనాల వినియోగంతో క్యాన్సర్ బాధితులు రోజు,రోజుకు పెరుగుతున్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి స్వచ్ఛత వైపు పయనించాలి. స్వచ్ఛమైన ఆలోచనలతోనే మంచి ఆరోగ్యం, మెరుగైన సంపాదన సాధ్యం. గత ప్రభుత్వం చెత్త పై పన్ను వేస్తే….ఎన్డీఏ ప్రభుత్వం చెత్త నుండి సంపదను సృష్టించే కార్యక్రమాలకు నాంది పలికింది. ప్రతి నెల మూడో శనివారం ఎవరికి ఎన్ని పనులు ఉన్నా కూడా కొంత సమయం పరిశుభ్రతకు కేటాయించాలి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసే విధంగా మిషనరీ ఏర్పాటు చేస్తున్నాము. కందుకూరులో ప్రతిరోజు 25 టన్నుల చెత్త రీసైక్లింగ్ కెపాసిటీతో మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించబోతున్నాము. కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాము. కందుకూరు మున్సిపాలిటీకి రూ 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కందుకూరు సమీపంలోని నాలుగు గ్రామాల గర్భ కండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపుతాం. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటాం. వెలుగొండను పూర్తి చేసి కందుకూరుకు నీళ్లు అందిస్తాం. . నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నూరు శాతం చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టాము.
8 నెలల్లోనే అభివృద్ధి పరుగులు పెట్టించాం
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో దగా జరిగింది. రూ. 10 లక్షల కోట్లు అప్పుచేసి పోయారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతినకుండా ఆ అప్పులు చెల్లిస్తున్నాము. ప్రజల మనోభావాలను తెలుసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాము. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకువస్తే.. ప్రస్తుతం ప్రజల వద్దకే పాలన మేము తీసుకొచ్చాం. పెన్షన్లతో పేదలకు భద్రత వచ్చింది. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రతి నెలా 64 లక్షలమందికి పెన్షన్ అందిస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి రూ. 32, 520 కోట్లు వ్యయం చేస్తున్నాము. దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత ఖర్చు చేయడం లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు 161 ప్రభుత్వ సేవలు అందిస్తున్నాము. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం. దీపం పథకం పెట్టి దేశంలోనే మొదటిసారి గ్యాస్ అందించాము. ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. త్వరలో ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాం . కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ. 20 వేలు అందిస్తాము. రూ. 1600 కోట్లతో రోడ్లపై గుంతలను పూడుస్తున్నాము. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నివారణకు డేగకన్నుతో పనిచేస్తున్నాము. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే వదిలిపట్టే ప్రసక్తే లేదు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. తద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము. స్కిల్ డెవలప్మెంటు సెంటర్ల ద్వారా యువతలో వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుస్తాం. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. నెల్లూరులో రూ. 330 కోట్లతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే 10 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను, రాజమండ్రిలో 340 కోట్లతో 640 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే 12 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నాము. రూ. 60 కోట్లతో ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నాము. 300 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ గా త్వరలో డిక్లేర్ చేస్తాం. రాష్ట్రంలో 29 శాతం ఉన్న గ్రీన్ కవర్ ను 50 శాతానికి పెంచేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజల చేత స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ
ప్రజలందరి చేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. దూబగుంటలో రూ. 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యర్ధాలను శుభ్రపరిచే మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ యంత్రాన్ని (ఎంఆర్ఎఫ్సి) ప్రారంభించారు. దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను , స్వచ్చాంధ్ర లక్ష్యం దిశగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. ఈ సంరద్భంగా కందుకూరులో స్కిల్ డెవలప్మెంటు సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కోరారు.