-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి
-రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ
-చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ ఈ నెల 17వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఎగ్జిబిషన్ లో రాష్ట్రానికి చెందిన చేనేత సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరగడంతో పాటు డిజైన్లు, దుస్తుల తయారీలో మెళకువులపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంది. భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. ఈ పెవిలియన్ లో ఆప్కో, లేపాక్షి సహా పలు ప్రైవేటు కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ప్రధాని నరేంద్రమోడి ఆదివారం భారత్ టెక్స్ ను సందర్శించి, టెక్స్ టైల్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర చేనేత,జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హాజరుకానున్నారు. ఆది, సోమవారాల్లో ఢిల్లీలోని ఉండి, రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడుల కోసం ఎకానమిక్ డవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచేలా కూడా భేటీలను వినియోగించుకునేలా మంత్రి సవిత ప్రణాళికలు రూపొందించుకున్నారు. మంత్రి వెంట పలువురు చేనేత, జౌళి శాఖాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.