-తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు కో- ఆప్టెక్స్ చేనేత వస్త్రాలు చిహ్మమని, ఆప్కో, కో ఆప్టెక్స్ షోరూమ్లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఆర్.గాంధీ అన్నారు.
విజయవాడ ఏలూరు రోడ్డులో ఆధునికీకరించిన కో -ఆప్టెక్స్ షోరూంను శుక్రవారం తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో చేనేత వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తమిళనాడు ఆధ్వర్యంలోని కోఆప్టెక్స్ షోరూమ్లో ఆప్కో వస్త్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆప్కో షోరూమ్లో కోఆప్టెక్స్ వస్త్రాలు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎంతోమంది చేనేత కళాకారులు యంత్రాలు వినియోగించకుండా తయారుచేస్తున్న చేనేత వస్త్రాలు వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారన్నారు. సాధారణ వస్త్రాలతో పోలిస్తే చేనేత వస్త్రాలు ముఖ్యంగా మహిళలు ధరించే చీరలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. మహిళల వస్త్రధారణలో వస్తున్న అధునాతన జీవనశైలి, అభిరుచులకు అనుగుణంగా కోఆప్టెక్స్ సైతం వస్త్రాల డిజైన్లలో మార్పులు చేస్తోందన్నారు. చేనేత వస్త్రాలను ప్రజలకు మరింత చెరువచేసేందుకు కో ఆప్టెక్స్-ఆప్కో ఫ్యాబ్రిక్స్ రెండు సంస్థలు మంత్రుల స్థాయిలో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. తమిళనాడు రాష్ట్రాలలో చేనేతరంగాన్ని ఉపాధిగా చేసుకుని ఎంతోమంది కార్మికులు జీవిస్తున్నారన్నారు. భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా చేనేత రంగం వినియోగదారుల ఆదరాభిమానాలు పొందుతోందన్నారు. చేనేత వస్త్రధారణ మహిళలకు ఎంతో హుందాగా ఉంటుందన్నారు. ఆధునికతరం మహిళల్లో సైతం చేనేత వస్త్రాలపై మక్కువ కలిగించేలా కో ఆప్టెక్స్ నిత్యనూతనమైన వస్త్రాలను రూపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, తమిళనాడు కో-ఆప్టెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జాకబ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.పి.రవి, జనరల్ మేనేజర్ శంకర్, రీజనల్ మేనేజర్ సి.నాగరాజన్, షోరూమ్ మేనేజర్ పి.వేణు, కో- ఆప్టెక్స్ సిబ్బంది, చేనేత వస్త్రాభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News