గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజు బకాయిలను మార్చి 15 వ తేదీ లోపు ఏజెన్సీల వారు చెల్లించాలని, లేని పక్షంలో సదరు హోర్డింగ్ లను తొలగించాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం అడ్వర్టైజింగ్ ఏజెన్సిలతో మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కమీషనర్ ఛాంబర్ నందు బకాయిల వసూళ్ళ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సదరు సమావేశం నందు తొలుత, ఏజెన్సిల వారీగా నగర పాలక సంస్థకు చెల్లించవలసిన బకాయిలు మరియు వారు చెల్లించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, 2024-25 సంవత్సరానికి సంబంధించిన హోర్డింగ్ బకాయిలను మరియు ఎరియర్స్ మార్చ్ 15 లోపు నూరు శాతం చెల్లించాలని, లేని పక్షంలో సదరు హోర్డింగ్ లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించుట జరుగుతుందని ఏజెన్సి ల వారిని హెచ్చరించారు. మార్చ్ 15 అనంతరం బకాయిలను పూర్తి స్తాయిలో చెల్లించిన వారి హోర్డింగ్ లను డిజిటలైజ్ చేయుట జరుగుతుందన్నారు. అంతేకాక పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని తొలగించాలని ఆదేశించారు. అలాగే ఏజెన్సి లవారు నగరంలో నూతనగా హోర్డింగ్లు ఏర్పాటు చేయాలంటే ముందుగా నగర పాలక సంస్థ నుండి అనుమతి తీసుకొనుటకు దరఖాస్తు చేసుకోవాలని, సదరు దరఖాస్తును పరిశీలించి నగర పాలక సంస్థ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారన్నారు.
సదరు సమావేశెంలో సిటీ ప్లానర్ రాంబాబు, డి.సి.పి సూరజ్ కుమార్, ఏ.సి.పి లు రహమాన్, వెంకటేశ్వర రావు, మల్లిఖార్జున, టి.పి.యస్ లు, టి.పి.బి.ఓ లు మరియు అడ్వర్టైజింగ్ ఏజెన్సిల వారూ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News