-ఫిర్యాదులు రుజువైతే ఏజెన్సీ లైసెన్సులు రద్దు చేస్తాం….
-జిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దీపం-2 పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లకు లబ్ధిదారుల నుండి అదనంగా నగదు వసూలు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేయటం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి అన్నారు.
దీపం-2 పథకం అమలు, ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలు, ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో పాటు గ్యాస్ కంపెనీ దారులు, ఎల్పిజి డీలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో డి ఎస్ఓ మాట్లాడుతూ
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడి రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న దీపం-2 పథకము ద్వారా అర్హులైన ప్రతి వినియోగదారునికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 3.42 లక్షల గ్యాస్ వినియోగదారులకు ఉచితముగా అందచేయడం జరుగుతుందన్నారు. ఎల్పిజి డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఇంటి వద్ద సిలిండర్లను సరఫరా చేసే సమయంలో వినియోగదారుల నుండి నిర్ణీత మొత్తం కంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నా యన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్, గ్యాస్ సిలిండర్లను తూకం వేసి లబ్దిదారుల ఇంటి వద్ద అందచేయాలని, ఎట్టి పరిస్థితులలోనూ గ్యాస్ వినియోగదారుల రశీదులో ముద్రించిన ధరకన్నా అదనపు సొమ్ము వసూలు చేయరాదని, అలా అదనపు వసూలు
చేసినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ , పంపిణీదారుల పై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అటువంటి గ్యాస్ పంపిణీ ఏజన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సులను రద్దు చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు. గ్యాస్ వినియోగదారులు, వారికిచ్చిన రశీదులో ముద్రించిన ధరకన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ విధముగా కాకుండా లబ్దిదారుల నుండి గ్యాస్ ఏజన్సీలు అదనంగా డబ్బులు వసూలు చేసినట్లయితే, వినియోగదారుడు సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సేల్స్ అధికారికి, మండల తహశీల్దార్/ పౌర సరఫరాల ఉప తహశీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారి వారికి ఫిర్యాదు చేయ వచ్చునని, లేదా టోల్ ఫ్రీ నెం. 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవలసినదిగా కోరడం జరిగిందన్నారు. వినియోగదారులకు, ఎల్పిజి సిలిండర్లను ఎటువంటి ఆటంకం లేకుండా పంపిణీ చేయాలని, ఈ పథకములో ఎటువంటి అవక తవకలు జరిగినా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ,డెలివరీ బాయ్స్ ఇరువురు పైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి హెచ్చరించారు.
సమావేశంలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ టి. రాజేంద్రప్రసాద్, జిల్లాలోని వివిధ గ్యాస్ కంపెనీ దారులు ఎల్పీజీ డీలర్ల పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News