– ప్రజలు, పశుపక్ష్యాదులకు తాగునీటి నీటి సమస్య అనేది రాకూడదు
– అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవికాలంలో ప్రజలు, పశుపక్ష్యాదులకు నీటి ఎద్దడి సమస్య అనేది తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్లో గ్రామీణ నీటిసరఫరా.. ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా వేసవికాలంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాలను గుర్తించే పని తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ వేసవి కాలంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు అధికారులు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెటూర్లలో సైతం ప్రభుత్వం పరంగా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తాగునీటి పైపులైన్ల మరమ్మత్తు ప్రాంతాలు గుర్తించి తక్షణమే పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో జనాభా ఆధారంగా తాగునీరు అందించేందుకు అవసరమైన సమాచారాన్ని అధికారులు ఇతర శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలలో పరిస్థితిని అనుసరించి తగిన కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల సమీపంలో ఉండే చెరువులను ఎప్పటికప్పుడు నిండుగా ఉండేలా చర్యలు కూడా చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న పైపులైన్ల నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్, మే నెలల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయని, అటువంటి కీలక సమయంలో అధికారులు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. వడగాల్పులు ఏర్పడినప్పుడు ప్రజలు ఆరోగ్యం పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తాగునీరు పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే 0866-2575822, 91549 70454 నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు
Prajavartha Online Telugu News