గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామాని గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఇంచార్జి మేయర్ షేక్ సజిలా తెలిపారు. మంగళవారం ఇంచార్జి మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన మెయిన్ ఆఫీస్ లోని కౌన్సిల్ హాల్లో నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఇంచార్జి మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ ఈ నెల 15న అప్పటి మేయర్ గా ఉన్న కావటి శివనాగ మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ జిల్లా కలెక్టర్ కి లేఖ అందించారన్నారు. సదరు రాజీనామా అంశాన్ని చర్చించి, అంగీకరించుటకు మంగళవారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఓటు హక్కు కల్గిన 58 మంది సభ్యులు (ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి) హాజరయ్యారన్నారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపి 26 సభ్యులు (ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో సహా) సమావేశం నుండి వాక్ అవుట్ చేయడం జరిగిందన్నారు. తదుపరి కొనసాగిన సమావేశంలో మిగిలిన 32 మంది ఓటు హక్కు కల్గిన సభ్యులు (ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి) కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామాని అంశాన్ని చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడమైనదన్నారు.
కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ ఈ నెల 15న కావటి శివనాగ మనోహర్ నాయుడు తన రాజీనామా లేఖను కలెక్టర్ గారికి పంపారని, తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమకు పంపడం జరిగిందన్నారు. స్టాండింగ్ కమిటి సభ్యులు కూడా ఈ విషయమై చర్చించి మేయర్ రాజీనామాను ఆమోదించడానికి అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారన్నారు. సదరు అంశాలపై రిపోర్ట్ ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రభుత్వం ఈ నెల 21న డిప్యూటీ మేయర్ గా ఉన్న షేక్ సజిలా ని నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు ఇంచార్జి మేయర్ గా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మంగళవారం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మనోహర్ నాయుడు రాజీనామా ఆమోదించడం జరిగిందని, తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని తెలిపారు.
సమావేశంలో ఎంఎల్సీలు సిహెచ్. ఏసురత్నం, లేళ్ళ అప్పిరెడ్డి , గుంటూరు తూర్పు, పశ్చిమ శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, టిడిపి ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంధ్ర, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News