రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు విషయంలో ఆయా పట్టాదారుల ద్వారా మాత్రమే త్రవ్వకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి నియోజక వర్గం పరిథిలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించేలా ఆర్డీవోలు పర్యవేక్షణా చేయాలన్నారు. నిర్దేశించిన మేరకు ఆయా నియోజక వర్గాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు లో ఇసుక అందుబాటులో ఉంచాలని, ఇందుకు సంబంధించి ఏజెన్సీస్ ను బాధ్యులను చేయాలన్నారు. ఎవరైనా ఆమేరకు పనులు చేపట్టడం లో ముందుకు రాకపోతే వారికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. జిల్లా పరిథిలో సెమీ మెకానైజ్డ్ పాయింట్స్ కోసం పురుషోత్తమపల్లి ప్రక్కిలంక, అరికరేవుల, చిడీపి గుర్తించిన నలుగురు కాంట్రాక్టర్లు వారికి నిర్దేశించిన 24,06,000 మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇతర జిల్లాలకు కేటాయించిన 29,49,450 మెట్రిక్ టన్నుల ఇసుక పెండ్యాల , కుమారదేవరం , తాడిపూడి , సింగవరం , కాటవరం పాయింట్స్ కు చెందిన కార్యకలాపాల వివరాలను కలెక్టర్ కోరడం జరిగింది. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏజెన్సీస్ ను నియమించుకోవడం జరుగుతున్నట్లు మైన్స్ అధికారి తెలియ చేశారు. 70.42 ఎకరాల పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు కోసం 12 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు ఎస్పీ ఎన్ బి ఎమ్ మురళీ కృష్ణ, జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్ రాణి సుస్మిత , ఇరిగేషన్ డి ఈ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News