-మహిళల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉంది… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ ను రద్దు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు, పచ్చ మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యం, దురుద్దేశపూరితమైనదని, మహిళల సాధికారత, భద్రత, ఆర్థిక ఉపశమనం లక్ష్యంగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నుండి పత్రిక ప్రకటన విడుదల చేశారు.
‘స్త్రీ శక్తి’ పథకం మరింత బలోపేతం అవుతుంది తప్ప రద్దు అయ్యే ప్రశ్నే లేదని గత 9 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 67 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారుని తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించిన రూ. 2,350 కోట్ల సబ్సిడీ భారం ప్రభుత్వమే భరిస్తోందని , ఇందులో ఇప్పటికే రూ. 720 కోట్లను ఆర్టీసీకి తిరిగి చెల్లించడం జరగగా ఇది ప్రభుత్వం మహిళల సంక్షేమంపై ఎంత నిబద్ధతతో ఉందో అనేది స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ పథకం అమలుతో ఆర్టీసీపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగి, గతంలో 60 శాతం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 92 శాతానికి పెరగడం ఈ పథకం విజయానికి నిదర్శనం అని స్పష్టం చేశారు. మహిళలతో పాటు టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా 40 శాతం వరకు పెరగడం వల్ల ఆర్టీసీ ఆదాయం మెరుగుపడినట్లు, అంతేకాకుండా, మహిళలు ప్రైవేట్ వాహనాల కన్నా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల సంఖ్య 39 శాతం తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో వెల్లడైందినీ అంటే ఈ పథకం కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు… మహిళల ప్రాణ భద్రతకు కూడా రక్షణ కవచంగా మారడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో 1,450 కొత్త ఈవీ బస్సుల కొరకు ప్రతిపాదనలు పంపగా 750 బస్సులను త్వరలో ఆర్టీసీలో ప్రవేశపెడుతోంది. ఇవి పర్యావరణ హితమైనవి, ఆధునిక సౌకర్యాలతో కూడినవి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం. ఈ-బస్సులు వస్తే ‘స్త్రీ శక్తి’ పథకం రద్దవుతుందని చెప్పడం పూర్తిగా అవాస్తవం.
ప్రతిపక్షాలు మహిళల సంక్షేమంపై జరుగుతున్న మంచి కార్యక్రమాలను కూడా రాజకీయ లాభాల కోసం వక్రీకరించి ప్రచారం చేయడం దురదృష్టకరం. ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, గౌరవప్రదమైన ప్రయాణ సౌకర్యాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
‘స్త్రీ శక్తి’ పథకం మరింతగా విస్తరించి మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అందులో భాగంగానే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది అని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News