-2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి అటవీ శాఖ ముమ్మర సన్నాహాలు
-జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా హరిత సమరం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను అందించడం కోసం ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ హరిత సమరంలో భాగంగా జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. వర్షాకాలం సీజన్ను పూర్తిగా వినియోగించుకుంటూ జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం మూడు రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించనున్నారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ల సాంకేతికత ఉపయోగించడం, చేతులతో నాటడం చేస్తారు. అడవులలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిణామాన్ని మెరుగుపరచడం, పర్యావరణ స్థిరత్వం, పచ్చదనాన్ని పెంచడం, వాతావరణ మార్పులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం కోసం ఈ హరిత ఉద్యమం ప్రధాన లక్ష్యం. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులకి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “మనం చల్లే ప్రతి విత్తన బంతి.. మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ. రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలుపుదామ”ని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News