– తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గంలో, సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్)పై పార్టీ బిఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్ది పాల్గొని బి.ఎల్.ఏలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, పార్టీ సిఇసి సభ్యులు మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, “బి.ఎల్.ఎ అంటే పదవి కాదని. పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన బాధ్యత” అని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ, బూత్ స్థాయిలో పార్టీ ఓట్లను అక్రమంగా తొలగించకుండా కాపాడాలని, అలాగే దొంగ ఓట్లను గుర్తించి తొలగించేలా చురుకుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల హర్యానా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితాపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కర్ణాటకలో ఒకే ఇంట్లో 150 ఓట్లు, హర్యానాలో ఒకే ఇంటి నంబరుపై 30 నుంచి 35 ఓట్లు నమోదైన ఘటనలు వెలుగులోకి వచ్చాయని గుర్తుచేశారు. ఎస్ఎస్ఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేసిన పార్టీలు తీవ్రంగా నష్టపోయాయని, మనం అలాంటి పరిస్థితులు రానీయకూడదని హెచ్చరించారు.
ఎస్ఎస్ఆర్ ప్రక్రియ సాధారణ ఓటర్ల జాబితా సవరణ కాదని, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే అత్యంత కీలకమైన ప్రక్రియ అని వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా ధృవీకరించాలని, అర్హులైన కొత్త ఓటర్లను చేర్పించాలని, చనిపోయిన వారి పేర్లు తొలగించాలని, తప్పులను సరిచేయాలని సూచించారు. బి.ఎల్.ఓలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, ఓటర్ల సంతకాలతో కూడిన రికార్డులను సక్రమంగా అప్లోడ్ చేయించే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థ, నవరత్నాల వంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి ప్రజలకు చేరవేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో జరుగుతున్న అరాచకాలు, స్వప్రయోజన రాజకీయాలు, దోపిడీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యకర్తలే పార్టీకి కళ్ళు, చెవులు లాంటి వారని, ప్రతి బూత్లో పార్టీని ముందుకు నడిపించే పూర్తి బాధ్యత వారి భుజాలపై ఉందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ప్రతిపక్షాల డైవర్షన్ రాజకీయాలను పట్టించుకోకుండా, పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News