విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ద్వారా డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఫ్రాంచైజీ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇంచార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ నిరుద్యోగ మహిళలు, యువతులు తక్కువ పెట్టుబడితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రముఖ బ్రాండ్ల సహకారంతో మల్టీ బ్రాండ్ మార్ట్లు, రిటైల్ స్టోర్లు, టీ & స్నాక్స్ అవుట్లెట్లు, ఫుడ్ కోర్టులు, మిల్లెట్స్ మార్ట్లు, కాఫీ అవుట్లెట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బ్యూటీ సలూన్లు, ఎంబ్రాయిడరీ యూనిట్లు తదితర వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ, బ్రాండ్ మద్దతు, మార్కెటింగ్ సహాయం, బ్యాంకు రుణాల సమన్వయం, ప్రభుత్వ పథకాల అనుసంధానం వంటి సేవలను MEPMA ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు తమ సామర్థ్యానికి, ఆసక్తికి అనుగుణంగా ఫ్రాంచైజీని ఎంపిక చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల డ్వాక్రా మహిళలు అర్హులని, సంబంధిత పత్రాలతో తమ ప్రాంత కమ్యూనిటీ ఆర్గనైజర్ (CO), టౌన్ లెవల్ ఫెడరేషన్ (TLF), CDO, విఎంసి కార్యాలయంలో గల యుసిడి విభాగం నందు లవ్లీ హుడ్ ప్రమోషన్ సెల్ వారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ అవకాశాన్ని నగరంలోని అర్హులైన డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News