-ఉద్యోగులు ప్రతిరోజూ ఏదో ఒక క్రీడకు సమయం కేటాయించాలి
కలెక్టరేట్ ఇగ్నైట్ సెల్లో క్రీడా పరికరాల ప్రదర్శనను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు విధుల నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ కొంత సమయాన్ని ఏదో ఒక క్రీడకు కేటాయించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ను బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ఇండోర్ క్రీడలను స్వయంగా ఆడి సిబ్బందిని, సందర్శకులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ఆదాయ వనరులను పెంపొందించే ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు ప్రోత్సాహం కల్పించడం, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా జిల్లాలో సమగ్ర అభివృద్ధికి దోహదపడే సమాచార వేదికగా ఇగ్నైట్ సెల్ పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్యంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి శాఖ సేవలను ప్రజలకు చేరువ చేసే సమాచార వేదిక ఇగ్నైట్ సెల్ ద్వారా ప్రతిరోజూ ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన సేవలు, పథకాలు, కార్యక్రమాలు, ఆ శాఖ రూపొందించిన ఉత్పత్తులు, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రదర్శన రూపంలో అందుబాటులో ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వ శాఖల పనితీరు, అవకాశాలు, సేవలపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందన్నారు. ఈరోజు జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పరికరాలు, క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడా శాఖ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు, వారికి లభిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలను ప్రదర్శనలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని కలెక్టర్ అన్నారు. ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఉత్సాహభరితమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కె.కోటేశ్వరరావు, క్రీడా శిక్షకులు, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News